*ఫలించిన ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు కృషి*

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ 

సుల్తానాబాద్ పట్టణంలోని ఊర చెరువును మినీ ట్యాంక్ బండ్ గా సుందరీకరణ చేసేందుకు రూ. 8 కోట్ల 77 లక్షల 50 వేల రూపాయలు ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఈ. శ్రీధర్ జీవో 170 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయరమణ రావు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చాలా కాలంగా ఊర చెరువును అభివృద్ధి చేస్తామని గతంలోని పాలకులు మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకున్నారు. దీంతో చెరువు కట్టకు బుంగలు ఏర్పడి ప్రమాదకర పరిస్థితికి ఏర్పడింది. అలాగే సాగునీటి స్థిరీకరణ కూడా కుంటుపడింది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసేందుకు పట్టుదలతో కృషిచేసి నిధులు మంజూరు చేయించడం జరిగిందని వెంటనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. సుల్తానాబాద్ మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి నిధుల మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల మరియు ఆహార  పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,జిల్లా మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా సుల్తానాబాద్, సుగ్లాంపల్లె, కందునూరుపల్లె తో పాటు చెరువు కింద పంట పొలాలు సాగు చేసే వివిధ గ్రామాల రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేశారు. చెరువు కట్ట ఆధునికరణ వల్ల సాగునీటి స్థిరీకరణతో పాటు సుల్తానాబాద్ పట్టణంలో బావుల్లో సైతం నీటి నిలువలు పెరుగుతాయని ఎమ్మెల్యే విజయరమణ రావు తెలిపారు. సుల్తానాబాద్ పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈ చెరువును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.