కోరుకంటి చందర్ పిలుపు
అగ్ని ధార న్యూస్,(రామగుండం):
ఈనెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం గోదావరిఖనిలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలన ప్రజల ఆశలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యం లేకుండా వ్యవహరిస్తున్నారని, జగిత్యాల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని పక్కన పెట్టడం దురదృష్టకరమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, స్కాములు, అవినీతి ఆరోపణలతో పాలన నడుస్తోందని చందర్ విమర్శించారు. మూసి ప్రక్షాళన పేరుతో భారీగా నిధుల దుర్వినియోగానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. హైడ్రా చర్యలతో మధ్యతరగతి ప్రజల ఇళ్లు కూల్చివేయడం అన్యాయమని పేర్కొన్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి రక్షణగా నిలుస్తుందని అన్నారు. జగిత్యాల సభ కేవలం రాజకీయ సభ మాత్రమే కాకుండా, రాష్ట్ర రాజకీయ దిశను మార్చే చారిత్రాత్మక ఘట్టమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్లు, సర్పంచ్లు, మండల, పట్టణ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

