స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ.

 అగ్ని ధార న్యూస్ పెద్దపల్లి జిల్లా జనవరి -11:

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం  అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ,… అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి,  జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఓబన్న 217వ జయంతి వేడుకలలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అదనపు కలెక్టర్లు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా వడ్డే ఓబన్న నిర్వహించిన పాత్ర, ఆయన జీవిత చరిత్రను జిల్లా వెనుకబడి తరగతుల అధికారి చదివి వినిపించారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ మాట్లాడుతూ….

తొలితర స్వాతంత్ర్య సమరయోధుడైన వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఆయన అందించిన స్ఫూర్తిని మనమందరం స్మరించుకోవాలని అన్నారు.

అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ…

తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయమని, వారి జీవితం మనందరికీ ఆదర్శమని, వారి విలువలు, సూచనలు పాటిస్తూ మెరుగైన సమాజ నిర్మాణం కోసం మనమంతా కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు.

తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని, మహనీయులు చేసిన గొప్ప పనులను స్మరించుకోవడం వల్ల వారు అందించిన స్ఫూర్తి, విలువలు మనకు తెలుస్తాయని అదనపు కలెక్టర్ అన్నారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రధాన సహచరుడిగా బ్రిటిష్ ఇండియా కంపెనీకి  వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అదనపు కలెక్టర్ అన్నారు. స్వార్థ ప్రయోజనాలతో బ్రతికే సమాజంలో ఆనాటి కాలంలోనే ఆయన నిస్వార్ధంగా మంచి విలువలను పాటిస్తూ దేశం కోసం పోరాటం చేశారని అన్నారు.

వడ్డే ఓబన్న నిరంతరం కష్టపడే తత్వంతో జీవితాంతం చెడుపై పోరాటం చేస్తూ గడిపారని వారు చేసిన సేవలను మనం గుర్తు చేసుకుంటూ వారు అందించిన విలువలు పాటించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. మహనీయుల జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం వల్ల వారు అందించే విలువలు మనందరికీ మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి జే.రంగారెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ , ముఖ్య ప్రణాళిక అధికారి గంప రవీందర్, వడ్డెర సంఘం జిల్లా వైస్ చైర్మన్ కుంట పోశెట్టి, జిల్లా కార్యదర్శి వోళ్ళేపు బాలకృష్ణ, పట్టణ ప్రెసిడెంట్ కొట్టే సమ్మయ్య, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ బి.సి సంఘ నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.