అక్రమాలకు పాల్పడ్డ రొంపి కుంట పంచాయతీ కార్యదర్శి.
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, అక్టోబర్-29:
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సంబంధించి ఎటువంటి అక్రమాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్పష్టం చేశారు.
బుధవారం కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామం జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎం. తిరుపతి విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు.వారధి సొసైటీ ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా కమాన్ పూర్ మండలం రోంపికుంట గ్రామానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న ఎం.తిరుపతి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణల పై విచారణ చేసిన కలెక్టర్, అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో వెంటనే సంబంధిత ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సేవలను టర్మినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తుందని, ఈ పథకం అమలులో ఎటువంటి అక్రమాలకు పాల్పడినా అత్యంత కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
