అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంథని బిల్ కలెక్టర్ సస్పెన్షన్
– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
అగ్నిధార న్యూస్ మంథని :
అవినీతి ఆరోపణ నేపథ్యంలో మంథని మున్సిపాల్టీలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రాజును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.మంథని పట్టణ నివాసి సయ్యద్ అఫ్రోజ్ హుస్సేన్ సెప్టెంబర్ 19, 2024 నాడు బిల్ కలెక్టర్ రాజు అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేస్తూ దరఖాస్తు సమర్పించారు.ఇంటి పన్ను 50 వేలు పెండింగ్ ఉన్న నేపథ్యంలో పునః పరిశీలించే అంశంలో బిల్ కలెక్టర్ ను ఫిబ్రవరి 2024 నెలలో సయ్యద్ అఫ్రోజ్ హుస్సేన్ సంప్రదించగా 25 వేల రూపాయలు చెల్లించాలని చెప్పారని, 14 వేల రూపాయల నగదు, ఫోన్ పే ద్వారా 11 వేలు చెల్లించిన తర్వాత ఇంటి పన్ను రసీదు కోరగా, 647 రూపాయలకు మాత్రమే ఇంటి పన్ను రసీదు అందించారని ఫిర్యాదులో సయ్యద్ అఫ్రోజ్ హుస్సేన్ తెలిపారు. సయ్యద్ అఫ్రోజ్ హుస్సేన్ ఫిర్యాదు, అందుబాటులో ఉన్న ఆధారాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ బిల్ కలెక్టర్ ను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు.సస్పెన్షన్ కాలంలో బిల్ కలెక్టర్ మంథని హెడ్ క్వార్టర్ అనుమతి లేకుండా వదిలి వెళ్ళవద్దని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
