ఆదాయ సృష్టి పై ప్రత్యేక దృష్టి సారించాలి…
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
మహిళా సంఘాలు రుణాలను సకాలంలో చెల్లించాలి.
మౌలిక వసతుల ప్రతిపాదనలు సమర్పించాలి.
జిల్లా మహిళా సమాఖ్య సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్.
……………………….
అగ్నిధారన్యూస్,పెద్దపల్లి అక్టోబర్ -05:
………………………..
జిల్లాలోని మహిళా సంఘాలు ఆదాయం సృష్టించే కార్యక్రమాల పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో జిల్లా మహిళా సమాఖ్య నిర్వహించిన సమావేశంలో పాల్గోన్నారు.మహిళా సంఘాలకు అందిస్తున్న స్వశక్తి రుణాలు, రుణాల రికవరీ, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలు, మహిళా సంఘాలకు ఉన్న సమస్యలు మొదలగు అంశాలను కలెక్టర్ ఆరా తీశారు.
ఈసమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ…
జిల్లాలోని మహిళా సంఘాలు వారికి అందించిన స్వశక్తి బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీ నిధి రుణాలు సకాలంలో చెల్లింపులు, రికవరీ చేయాలని, ఎన్.పి.ఏ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్,సూచించారు. మహిళా సంఘాలు తమకు అందుతున్న బ్యాంకు లింకేజీ రుణాలను వినియోగించుకుంటూ ఆదాయం సృష్టించే కార్యక్రమాలు అమలు పై శ్రద్ధ వహించాలని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పెట్రోల్ బంక్, కళ్యాణ మండపం నిర్వహణ మొదలగు వివిధ ఆదాయం సృష్టించే కార్యక్రమాలను మహిళా సంఘాలు చేపట్టడం పై కలెక్టర్ చర్చించి పలు సూచనలు చేశారు.ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద మహిళా సంఘాలకు అందించే బ్యాంకు రుణాలను వినియోగించుకుంటూ వాణిజ్య వ్యాపార రంగాల్లో మహిళలు వృద్ధి సాధించాలని ప్రభుత్వం సంకల్పించి ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం అందించే అవకాశాలను వినియోగించుకుంటూ మహిళలు ఆర్థికంగా స్థిరపడాలని కలెక్టర్ కోరారు.జిల్లా మహిళా సమాఖ్య సంఘానికి ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. మహిళా సమాఖ్య కార్యాలయానికి అవసరమైన ఫర్నిచర్ ,టాయిలెట్స్ మరమ్మత్తులు ,నూతన టాయిలెట్ నిర్మాణం మొదలగు ప్రతిపాదనలు అందించాలని వాటిని వెంటనే మంజూరు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సరస్వతి, కార్యదర్శి కోమల, తదితరులు పాల్గొన్నారు.


