జిల్లాలోని బెల్ట్ షాపులు మూసివేయాలి

అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు.

ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి.

బెల్ట్ షాపులపై కఠిన వైఖరి అవలంభించాలి

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి.

అగ్నిధారన్యూస్. పెద్దపల్లిమార్చి -05:

జిల్లాలో ఉన్న మద్యం బెల్ట్ షాపులపై కఠిన వైఖరి అవలంబించాలని, ఎక్సైజ్ అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వెంటనే బెల్ట్ షాపులను మూసివేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తన క్యాంపు కార్యాలయంలో బెల్ట్ షాపులు మూసివేయడంపై సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ,జిల్లా వ్యాప్తంగా ఉన్న అక్రమ మద్యం అమ్మకాల దుకాణాలను గుర్తించి వాటిని వెంటనే మూసివేయాలని, బెల్ట్ షాపుల నిర్వాహకులపై ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసులు బుక్ చేయాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో ప్రభుత్వం అనుమతించిన వైన్ షాపులు, బార్ లలో మాత్రమే మద్యం విక్రయాలు జరగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ బెల్ట్ షాపులలో మద్యం విక్రయాలు జరగవద్దని, ప్రతి వైన్ షాప్ కు కేటాయించే మద్యం స్టాక్ వివరాలు నిరంతరం పరిశీలించాలని, బెల్ట్ షాపుల నిర్వాహకుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

బెల్ట్ షాపుల నిర్మూలన పట్ల అలసత్వం వహిస్తే అధికారులపై సైతం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా బెల్ట్ షాపుల నిర్మూలనకు అధికారులు కృషి చేయాలని, బెల్ట్ షాపుల నిర్మూలనలో అధికారులకు పూర్తిస్థాయి సహకారం అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి, ఎక్సైజ్ సీఐలు పెద్దపల్లి -శిరీష, రామగుండం -మంగమ్మ, సుల్తానాబాద్ -గురునాథ్, మంథని -రాకేష్, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.