అసోసియేషన్‌ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరెల్లి మల్లేష్‌.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి

ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాఫక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడం పట్ల తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరెల్లి మల్లేష్‌ హర్షం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాల పాటు అణగారిన జాతుల కోసం అలుపెరగని పోరాటంలో తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాలలో మాదిగల ఎబిసిడి వర్గీకరణే ధ్యేయంగా ఏర్పాటు చేసిన మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్‌) 1994లో స్థాపించి, మహబూబ్‌ నగర్‌ జిల్లా ఈదుముడి గ్రామం మీదుగా మొదలుపెట్టి మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రాలలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి హయాంలో నిరుపేదలకు గుండె ఆపరేషన్‌ చేసుకునేందుకు చిల్లిగవ్వలేని పేద ప్రజలకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద రెండు లక్షల రూపాయలు ఇచ్చేలా మంద కృష్ణ మాదిగ అనేక ఉద్యమాలు చేపట్టారని అన్నారు. అదేవిధంగా అన్ని వర్గాల జాతుల కొరకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్‌ అమలయ్యేలా అనేక ఉద్యమాలు చేసి డిమాండ్ల సాధనకు అమలయ్యేలా కృషి చేశారని, దేశంలో చట్టసభల్లో మాదిగలకు విద్య, ఉద్యోగాలలో చోటు లేకపోవడంపై, మాదిగలు ఎదుర్కొంటున్న  అంతరాలను వివరించి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు, మరి ఎందరో ప్రధాన మంత్రులను ఒప్పించిన ఘనత మందకృష్ణ మాదిగకే దక్కిందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఉద్యమాలకు సైతం పురుడు పోసిన మహానాయకుడు మందకృష్ణ మాదిగని కొనియాడారు. అంతేకాకుండా మందకృష్ణ మాదిగ పోరాటాలకు అనేక ప్రభుత్వాలు తలొగ్గి రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా తనకు ఎన్నో పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ పదవులను లెక్కచేయకుండా జాతి మేలు కోసమే చూసిన మొట్టమొదటి వ్యక్తి మందకృష్ణ మాదిగని  అన్నారు. ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ రావడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు.